కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. 2011లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో చోటుచేసుకున్న ఘటనపై సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభకు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు తమ మిత్రపక్షాలనే ఢీకొన్న విషయాన్ని గుర్తుచేశారు. వి నారాయణ స్వామి ప్రమోషన్ కోటాపై బిల్లు పెడుతున్న సమయంలో సమాజ్ వాదీ ఎంపీ యశ్వీర్ సింగ్, అతని చేతి నుంచి బిల్లును లాక్కొని చించేశాడు. ఇదే సమయంలో సోనియా గాంధీ యశ్వీర్ సింగ్ కాలర్ పట్టుకునేందుకు ప్రయత్నించారని దూబే గుర్తు చేశారు. మీరు నియంత కాదు, రాణి కాదు, మీరు హింసను ఆశ్రయించలేరు అని అప్పుడు సోనియా గాంధీకి చెప్పినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఆ సమయంలో బీజేపీ అక్కడ లేకపోతే సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఉండేవారు కాదని, కాంగ్రెస్ ఆ ఎంపీలు అందరినీ చంపేందుకు ప్రయత్నించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
33 శాతం కోటాలో ఇతర వెనుక బడిన వర్గాల మహిళలను కూడా చేర్చాలని అన్నారు. ప్రతిపక్షం నుంచి తొలుతగా సోనియా మాట్లాడారు. ఈ బిల్లు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే కన్సర్నడ్ గా కూడా ఉన్నామని అన్నారు. భారత మహిళలు రాజకీయ అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఎదురుచూడమని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? అని ప్రశ్నించారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ బిల్లుకు తనకు ఎంతో ఎమోషనల్ అని, తన భర్త రాజీవ్ గాంధీ లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు ప్రారంభించారని సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుకు మద్దతిస్తుందని స్పష్టంచేశారు. అయితే ఎస్పీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ద్వారా దీనిని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. దీని అమలులో ఆలస్యం చేయడం భారత మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్లైంది.
అయితే ఇందులో OBC మహిళలకు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం, చర్చకు దారితీస్తోంది. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ల అంశం గతంలో పార్లమెంట్ లోపల, వెలుపల అనేక ఆవేశ పూరిత చర్చలకు కారణమైంది. 1996 మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక OBCలకు రిజర్వేషన్ను కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. రాజ్యసభ, శాసనమండలిలకు కూడా రిజర్వేషన్లు పొడిగించాలని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు ఏవీ 2010 బిల్లు, తాజా బిల్లులో పొందుపరచబడలేదు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో OBC లకు రిజర్వేషన్ కల్పించలేదు
సోనియాకు కౌంటర్
మహిళా రిజర్వేషన్ బిల్పై పార్లమెంట్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళా ఎంపీల ప్రసంగాలతో సభలు దద్దరిల్లిపోయాయి. ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ చర్చ మొదలు పెట్టారు. ఆ తరవాత వరసగా డీఎమ్కే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడారు. మోదీ ప్రభుత్వంవై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రెజ్లర్లు అన్ని నెలల పాటు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ఎన్నికల గిమ్మిక్కు అంటూ మండి పడ్డారు. దీనికి దీటుగానే బదులిచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. మోదీ ప్రభుత్వం మహిళలను లెక్కలోకి తీసుకుందని, గత ప్రభుత్వాలు మాత్రం మహిళల్ని లెక్క చేయలేదని తేల్చి చెప్పారు. ఈ బిల్కి సంపూర్ణ మద్దతునిస్తామని వెల్లడించిన సోనియా గాంధీ…ఓబీసీ వర్గానికి చెందిన మహిళలకు సబ్కోటా ఇవ్వాలని కోరారు. వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారని అన్నారు సోనియా. దేశ స్వాతంత్య్రోద్యమం నుంచి మహిళల పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
2010లోనే తాము రాజ్యసభలో ఈ బిల్ ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. అప్పట్లో కొందరు ఈ బిల్ని అడ్డుకున్నారని, అందుకే అమల్లోకి తీసుకురాలేకపోయామని స్పష్టం చేశారు. అప్పట్లో రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయినప్పటికీ లోక్సభలో పాస్ కాలేదు. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ అడ్డుకోవడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే…2029 వరకూ మహిళలకు ఈ బిల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని తేల్చి చెప్పారు సోనియా గాంధీ. ఇది అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలు ఎన్నాళ్లు వేచి చూడాలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎమ్కే ఎంపీ కనిమొళి కూడా బిల్పై మాట్లాడారు. మహిళలను నమస్కరించాలని పూజించాలని చెప్పడం ఆపేయాలని, వాళ్లకు సమానత్వం ఇవ్వడం కన్నా గౌరవం ఇంకేమీ ఉండదని తేల్చిచెప్పారు. తమను తల్లిగా, చెల్లిగా, భార్యగా గౌరవించాల్సిన అవసరం లేదని, మగాళ్లతో సమానంగా చూస్తే చాలని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ బిల్ తీసుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న స్టంట్ అని మండి పడ్డారు.
ఈ బిల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. “మహిళలు ఇంట్లో వంట చేసుకుంటే ఇంకెవరో వచ్చి దేశాన్ని నడిపిస్తారు” అనే భావజాలంతో బీజేపీ పని చేస్తోందని అన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. అయితే..ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టిగానే స్పందించారు. సోనియా గాంధీ పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. 2010లో బిల్ తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం “ఇది మా బిల్” అని చెప్పుకుంటున్నారని మండి పడ్డారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్పై ఎన్నో వాదోపవాదాలు జరిగాయి.